“ఒక మంచి డాక్టర్ కావాలంటే ముందు వారు మార్క్సిస్టు అయి ఉండాలి. ఒక మంచి తండ్రి కావాలంటే ముందు మార్కిస్టు అయి ఉండాలి. …” అని రంగనాయకమ్మగారు తన ‘పెట్టుబడి పరిచయం’ పుస్తకం వెనక అట్టమీద రాస్తారు. మార్క్సిజాన్ని చదివితేనే ఎవరైనా ఒక మంచి “_____” (ఖాళీలొ మనుషుల లక్ష్యాలు ఏవైనా పెట్టుకోవచ్చు) అవుతారని రంగనాయకమ్మ చెప్పదలుచుకున్నారు. అయితే ఇక్కడ ఆవిడ చెప్పేది ఒక శాసనంలాగా, తప్పనిసరి షరతు లాగా ధ్వనిస్తుంది. మార్క్సిజంతో పరిచయం లేనివారికి అది చాలా అభ్యంతరకరంగా తోచడం సహజం. అందువలనే మార్క్సిజం లేకపోతే ఇక ప్రపంచమే లేదా, అది లేకపోతే ప్రపంచం బతకదా? అనే ప్రశ్నలు కూడా సహజంగానే ఉద్భవిస్తాయి.
వాస్తవానికి మార్క్సిజం గొప్పతనం గురించి చెప్పడానికి మాత్రమే ఆవిడ అలా రాశారని గమనించాలి. మార్క్సిజంతో పరిచయం లేకపోయినా అభ్యుదయంగా ఆలోచించేవారూ, మంచి భర్తగా, మంచి భార్యగా, మంచి డాక్టర్ గా, ఇంకా మంచి “___”గా ఉన్నవారు, ఉంటున్నవారు చాలామంది ఉన్నారు. ఆ అభ్యుదయ భావాలు, మంచితనానికి మార్క్సిజానికి సంబంధించిన అవగాహన కూడా తోడయితే అటువంటి మంచివారూ, అభ్యుదయ కాముకులూ తన కుటుంబమూ, స్నేహితులతో పాటు సమాజానికి కూడా మరింత ప్రతిభావంతంగా ఉపయోగపడతారని రంగనాయకమ్మగారు (ఆ మాట కొస్తే మార్క్సిజం చదివినవారు ఎవరైనా సరే) చెప్పదలుచుకున్నారని గమనించాలి.
మార్క్సిజం తెలిసి ఉంటే వివిధ రకాల మనుషులు లేదా వృత్తుల్లో ఉన్నవాళ్ళు సమాజానిక మరింత సమర్ధవంతంగా ఉపయోగపడతారని ఇక్కడ రంగనాయకమ్మగారి భావన తప్ప మార్క్సిజంపై అవగాహన లేకపోతే ఏమవుతారు అన్న ప్రశ్నకు ఆవిడ చెప్పినదాంట్లో సమాధానం వెతకరాదని గమనించాలి. అంటే మార్క్సిజంపై ఆవిడ చెప్పే విషయాలు ఒకవైపునుండి చూసినప్పుడే అవిడ సరిగ్గా అర్ధమవుతారు. రెండో చివరనుండి చూస్తే వచ్చే అర్ధాలు ఆవిడ ఉద్దేశ్యంలో లేవని గమనించాలి. అంటే… మార్క్సిజం తెలిస్తే… మనుషులెలా ఉంటారో చెప్పింది తప్ప, మార్క్సిజం తెలియక పోతే గనక ఖచ్చితంగా అది తెలిసినవారికి వ్యతిరేకంగా ఉంటారని ఆవిడ ఉద్దేశ్యం కాదు.
“ఒక మంచి డాక్టరు కావాలంటే ముందు అతను/ఆమె మార్క్సిజం తెలుసుకొని ఉండాలి” అంటే, “మార్క్సిజం తెలియకపోతే చెడ్డ డాక్టర్ అవుతాడు” అని అర్ధం చేసుకుంటే అది తప్పని గమనించాలి.
మార్క్సిజం అనగానే చాలామందికి సుత్తీ కొడవలి, ఎర్రజెండా, పోరాటాలు, తుపాకి గొట్టం… ఇలాంటివే కనపడతాయి. కాని అవన్నీ వాస్తవానికి కొన్ని కోణాల్లో కనిపించే సంకేతాత్మక (సింబాలిక్) వస్తువులే తప్ప అవే మార్క్సిజం కాదు.
మార్క్సిజం అనేది ఒక సామాజిక శాస్త్రం, ఒక ఆర్ధిక శాస్త్రం. ఒక రాజకీయ శాస్త్రం కూడా. తత్వ శాస్త్రంలో సమస్త శాస్త్రాలూ ఇమిడి ఉంటాయని తెలిస్తే మార్క్సిజం ఒక తత్వ శాస్త్రం. అప్పటివరకూ తత్వ శాస్త్రం అంటే పండితులు మేధావులూ మాత్రమే చర్చించుకునే శాస్త్రం అని భావిస్తున్న దశలో మార్క్సిజం మొదటి సారిగా తత్వశాస్త్రాన్ని సామాన్య ప్రజల చెంతకు తెచ్చింది. సమాజం ఎలా ఉందో అప్పటివరకూ తత్వశాస్త్ర పండితులు చెబితే ఉన్న సమాజాన్ని సమస్త ప్రజా బాహుళ్యాలకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలో మార్క్సిస్టు తత్వశాస్త్రం చెప్పింది. అందుకనే అదింకా సజీవంగా నిలిచి ఉంది. అది సమాజం గురించి వివరిస్తుంది. సమాజంలో వివిధ వర్గాల ప్రజల మధ్య సంబంధాలను విశ్లేషిస్తుంది. సామాజిక సంబంధాలు ఆర్ధిక, రాజకీయ వ్యవస్ధలతో ఎలా ఆధారపడి ఉన్నాయో వివరిస్తుంది. సామాజిక సంబంధాలు సరిగా ఉన్నాయో లేదో చర్చిస్తుంది. సరిగా లేని సంబంధాలను ఎలా మార్చుకోవచ్చొ చెబుతుంది. మార్చుకోవడానికి అవసరమైన సైద్ధాంతిక ఉపకరణాలను అందిస్తుంది.
సామాజిక సంబంధాలను సరిగా అర్ధం చేసుకున్న డాక్టరు సమాజం అనుభవిస్తున్న సంపదలన్నీ శ్రమ ద్వారానే సృష్టించబడ్డాయని గ్రహిస్తాడు. సంపదలు సృష్టించే శ్రామికుడు శ్రమకు తగిన ఫలితం లేక పేదవాడిగా మిగిలాడని గ్రహిస్తాడు. అందువలన డబ్బులేని కూలీలు, కార్మికులు నిజానికి గౌరవనీయులనీ, అతని శ్రమే ప్రపంచ సంపదలకు మూలాధారమనీ గ్రహింపుతో పేద, గొప్ప తేడాలను నిరసిస్తాడు. పేదవారికి తక్కువ ఖర్చుతో, అసలు డబ్బులు కూడా లేకుండా వైద్యం చేయడానికి ముందుకు వస్తాడు. జార్ఘండ్ లో బినాయక్ సేన్ అలాంటి వైద్యుడే. అతని వైద్య జీవితమంతా గిరిజలుల జీవితాలకే అంకితం. తన వైద్య వృత్తిని డబ్బు కోసం కాకుండా మనుషుల కోసం, అందునా శ్రమ చేసే మనుషుల కోసం అంకితం చేశాడు. ఎ.పి ప్రభుత్వం ఎం.బి.బి.ఎస్ చదివిన వాళ్ళు తప్పనిసరిగా రెండు సంవత్సరాలు గ్రామాల్లో పనిచేయాలని నిబంధన తేబోతే జూ.డాలు సమ్మెకు దిగడం గమనిస్తే మంచి డాక్టరు, అందునా మార్క్సిజం తెలిసిన డాక్టరు ప్రాముఖ్యత అర్ధం అవుతుంది.
రంగనాయకమ్మగారు వ్యక్తిగత జీవితాలు సామాజిక వ్యవస్ధలతో ముడిపడి ఉన్న విషయాన్ని ప్రతి అంశంలోనూ చెబుతారు. కనుక వ్యక్తిగత బాగోగులు సమాజం బాగోగులతో ముడిపడి ఉన్న సంగతిని మనముందు ఉంచడానికి ప్రయత్నిస్తారు. మార్క్సిజం సమాజం బాగోగులను గురించే పట్టించుకున్న శాస్త్రం. అందువలనే జానకి విముక్తిని సమాజం విముక్తిని ప్రతిపాదించే మార్క్సిజంతో ముడిపెట్టి నిజమైన విముక్తి ఎలా వస్తుందో చెప్పడానికి ప్రయత్నించారు.
ఇక్కడ మార్క్సిజం గాల్లోంచి వచ్చింది కాదని గమనించాలి. సమాజాన్నీ, సామాజిక సంబంధాలనీ, సామాజికార్ధిక సంబంధాలనూ, రాజకీయార్ధిక సంబంధాలనీ తన జీవితకాలంలో అధ్యయనం చేసిన మార్క్సు “ఇదిగో, సమాజం, ప్రకృతి ఫలానా నియమాల ప్రకారం నడుస్తోంది. కొద్దిమంది స్వార్ధపరులు ఆర్ధిక వనరులను గుప్పిట్లో పెట్టుకుని మొత్తం సామాజిక గమనాన్ని తలకిందులుగా నడిచేలా శాసిస్తున్నారు” అని ఉన్న విషయాన్ని వీవరిస్తూ తాను గ్రహించిన సామాజిక నియమాల వెలుగులోనే తలకిందులుగా నడుస్తున్న సమాజాన్ని యధాస్ధానానికి ఎలా తెచ్చుకోవాలో ఒక మార్గాన్ని చూపించాడు. ఆ మార్గంలోనే సామాజిక, రాజకీయ, ఆర్ధిక అపసవ్యతలను ఎలా సవరించుకోవచ్చునో వివరించాడు. సైన్సు సూత్రాలు విశ్వజనీనమైనట్లే మార్క్సిస్టు శాస్త్రం కూడా విశ్వజనీనమైనది. ఒక జాతి, మతం, ప్రాంతం, దేశం అన్న పరిమితులతో నిమిత్తం లేకుండా మానవ సమాజాలన్నింటి గమనాన్ని మార్క్సిజం వివరిస్తుంది గనక అన్ని దేశాలకూ, అన్ని సమాజాలకూ, అన్ని ప్రాంతాలకూ అది పరిష్కారాన్ని సూచిస్తుంది.
అయితే మార్క్సిజం గురించి పరిచయం లేనివారికి మార్క్సిజానికీ, సమాజానికి ఉన్న సంబంధంతో గూడా పరిచయం ఉండదు. వారు మార్క్సిజం గొప్పతనాన్ని ఒప్పుకోమని శాసించలేము. మార్క్సిజం ఫలానా చెబుతుంది అని ఇప్పుడు చాలామంది చాలా రకాలుగా చెబుతుంటారు. అలా చెబుతున్న చోట మార్క్సిజం నిజానికి ఏం చెబుతుందో చెప్పడానికి ప్రయత్నించవచ్చు. వారు చెబుతున్నది నిజమని నమ్ముతున్నవారికి మాత్రమే మార్క్సిజం ఏం చెబుతుందో చెప్పగలం కానీ, మార్క్సిజంపై గుడ్డి ద్వేషంతో అదేం చెబుతుందో కూడా తెలియకుండా అది ఫలానానే చెబుతుందని వాదించేవారికి మార్క్సిజం గురించి బోధించాలని చూడటం వృధా ప్రయాస.
నిజానికి రంగనాయకమ్మగారు జానకి విముక్తి నవలను అంత ప్రతిభావంతంగా రాయడానికి కారణం ఏమిటి? ఆవిడ అధ్యయనం చేసిన మార్క్సిజమే దానికి కారణం. ఆచరణ, అధ్యయనాలతో సంపాదించిన జ్ఞానం ద్వారనే జానకి విముక్తి ని ఆకట్టుకునేలా, చదివిన మహిళల్లో అత్యదికులు నవలలో ఏదో ఒక చోట “ఇది నా జీవితమే” అని భావించేలా రాయగలిగిందని గమనిస్తే ఆవిడ మార్క్సిజం గురించి ఆ నవలలో చెప్పడానికి ఎందుకు తాపత్రయపడిందీ అర్ధం అయ్యే అవకాశం ఉంది.
చక్కగా రాశారు
చాలా వివరణాత్మక పరిచయం .thankyou.
జానకి విముక్తి మంచి నవల